మే 17, (నేటి తెలుగు పత్రిక): అమరావతిని దేశంలో క్వాంటమ్ టెక్నాలజీ కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. యువ శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, స్టార్టప్లు అమరావతిని కొత్త అవకాశాల వేదికగా చూస్తున్నారని పేర్కొన్నారు.గుంటూరుకు చెందిన రిక్షా కార్మికుడి కుమార్తె పల్లవి కాయాల క్వాంటమ్ రంగంలో ప్రతిభ కనబరుస్తోందని లోకేశ్ ప్రశంసించారు. పదో తరగతిలో పూర్తి మార్కులు సాధించిన ఆమె ప్రస్తుతం ఉన్నత సాంకేతిక రంగంలో ఇంజినీర్గా ఎదగడం గర్వకారణమన్నారు. ముంబై నుంచి అమరావతికి వచ్చిన గోపాల్ జోషి క్వాంటమ్ ఆపరేషన్స్ రంగంలో సేవలందిస్తున్నారని తెలిపారు. ప్రముఖ విద్యాసంస్థల్లో పరిశోధనలు చేసిన నాగలక్ష్మయ్య వంటి నిపుణులు కూడా అధునాతన ఆర్ఎఫ్ వ్యవస్థల అభివృద్ధిలో భాగమవుతున్నారని లోకేశ్ వివరించారు. నగరం పూర్తిస్థాయిలో రూపుదిద్దుకునే ముందే శాస్త్రవేత్తలు, పరిశోధకులు అమరావతి వైపు ఆకర్షితులు కావడం విశేషమన్నారు.అమరావతి యువత ఆశయాలకు ప్రతీకగా మారుతోందని ఆయన పేర్కొన్నారు. దేశంలో ఎదుగుతున్న డీప్టెక్ కేంద్రాల్లో అమరావతికి ప్రత్యేక స్థానం దక్కుతోందని తెలిపారు. విద్య, పరిశోధన, స్టార్టప్ల అభివృద్ధికి అనుకూల వాతావరణం సృష్టించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు.భవిష్యత్ టెక్నాలజీల రూపకల్పనలో ఆంధ్రప్రదేశ్ యువత కీలక పాత్ర పోషించబోతుందని నారా లోకేశ్ విశ్వాసం వ్యక్తం చేశారు.
