మే 17, (నేటి తెలుగు పత్రిక): తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమాన్ని ఈసారి హైబ్రిడ్ మోడల్లో నిర్వహించనున్నట్లు ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వెల్లడించారు. ఇంధన వనరుల సంరక్షణ, భారీ ఖర్చులను తగ్గించే ఉద్దేశంతో నెల్లూరులో ప్రత్యక్ష మహానాడును రద్దు చేసినట్లు తెలిపారు.విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రధాని నరేంద్ర మోదీ సూచించిన ఇంధన పొదుపు ఆలోచనకు సీఎం చంద్రబాబు మద్దతు తెలపడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. గతంలో కరోనా సమయంలో వర్చువల్ మహానాడు విజయవంతంగా నిర్వహించిన అనుభవం ఉందని గుర్తుచేశారు.ప్రత్యక్ష మహానాడుకు రూ.5 నుంచి రూ.10 కోట్ల వరకు ఖర్చు అయ్యే అవకాశముందని, వేలాది వాహనాలు ఒకేచోటికి చేరడం వల్ల ఇంధన వినియోగం అధికమవుతుందని వివరించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో భారీ స్క్రీన్ల ద్వారా మహానాడు కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.రాష్ట్రవ్యాప్తంగా వేల సంఖ్యలో ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేసి పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు మహానాడును వీక్షించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పార్టీ జాతీయ కార్యాలయం నుంచి సీనియర్ నేతలు కార్యక్రమానికి మార్గనిర్దేశం చేస్తారని వెల్లడించారు.సాంకేతికతను వినియోగిస్తూ ఖర్చు తగ్గింపు, పర్యావరణ పరిరక్షణ లక్ష్యాలతో ఈసారి మహానాడు కొత్త తరహాలో నిర్వహించనున్నట్లు పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు.
