మే 17, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులకు ఊరటనిచ్చేలా కరెంట్ ఛార్జీలను తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఎన్నికల నాటికి యూనిట్కు రూపాయి వరకు తగ్గించే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. దేశంలో ఇతర రాష్ట్రాలు ట్రూఅప్ పేరిట విద్యుత్ ఛార్జీలు పెంచుతున్న వేళ.. ఆంధ్రప్రదేశ్లో మాత్రం ట్రూడౌన్ విధానంతో భారం తగ్గించే ప్రయత్నం జరుగుతోందని మంత్రి పేర్కొన్నారు. గత ప్రభుత్వ విధానాల కారణంగా విద్యుత్ రంగం సంక్షోభంలో పడిందని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంస్కరణలతో పరిస్థితి మెరుగుపడుతోందన్నారు.భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని పునరుత్పాదక విద్యుత్ రంగానికి పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. కేంద్రంతో సీఎం చంద్రబాబు జరిపిన చర్చల ఫలితంగా రాష్ట్రానికి భారీ సంఖ్యలో ప్రధానమంత్రి సూర్యఘర్ కనెక్షన్లు మంజూరయ్యాయని వెల్లడించారు.సామాన్య ప్రజలకు నాణ్యమైన, అంతరాయం లేని విద్యుత్ను తక్కువ ధరలో అందించడమే ప్రభుత్వ లక్ష్యమని గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. విద్యుత్ రంగంలో పారదర్శకత, సామర్థ్యం పెంచి వినియోగదారులపై భారం తగ్గించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.
