మే 18, (నేటి తెలుగు పత్రిక): అమెరికా విధిస్తున్న 50 శాతం సుంకాల కారణంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎగుమతయ్యే ఆక్వా ఉత్పత్తులు తీవ్ర ప్రభావానికి గురవుతున్నాయని సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్కు పంపిన లేఖలో ఆక్వా రంగాన్ని ఆదుకునేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఈ సుంకాల ప్రభావంతో రాష్ట్రంలో 30 లక్షల మందికి పైగా కార్మికులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. ఆక్వా రైతులు, ఎగుమతిదారులు తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.రంగాన్ని కాపాడేందుకు వర్కింగ్ క్యాపిటల్ పరిమితులను 30 శాతానికి పెంచాలని, వడ్డీ చెల్లింపులపై 240 రోజుల మారటోరియం ఇవ్వాలని కోరారు. అదేవిధంగా 5 శాతం వడ్డీ రాయితీతో పాటు జీఎస్టీ నుంచి తాత్కాలిక మినహాయింపు కల్పించాలని సూచించారు.అమెరికాతో చర్చలు జరిపి సుంకాలను తగ్గించే దిశగా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని చంద్రబాబు తన లేఖలో విజ్ఞప్తి చేశారు.
