మే 18, (నేటి తెలుగు పత్రిక): తిరుమల పవిత్రతతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం కీలక సంస్కరణలకు సిద్ధమవుతోంది. తిరుమలకు వచ్చే పెట్రోల్, డీజిల్ వాహనాలపై టోల్ ఫీజు విధించే ప్రతిపాదనను టీటీడీ పరిశీలిస్తోంది.టీటీడీ ఈవో ఎం. రవిచంద్ర వెల్లడించిన వివరాల ప్రకారం, ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించే దిశగా ప్రత్యేక చర్యలు తీసుకోనున్నారు. ఈవీలకు టోల్ మినహాయింపుతో పాటు ప్రత్యేక ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం రోజుకు సుమారు 8 వేల వాహనాలు తిరుమలకు చేరుకుంటుండటంతో కాలుష్యం పెరుగుతోందని అధికారులు గుర్తించారు. అలాగే అలిపిరి వద్ద రూ.500 కోట్ల వ్యయంతో 150 ఎకరాల్లో భారీ టౌన్షిప్ నిర్మించేందుకు టీటీడీ ప్రణాళిక రూపొందించింది. ఇందులో వసతి గదులు, పార్కింగ్, భోజన సదుపాయాలు, పూజా సామగ్రి దుకాణాలు వంటి అన్ని సౌకర్యాలు కల్పించనున్నారు. భక్తులు ముందుగా అక్కడే ఏర్పాట్లు పూర్తి చేసుకుని అనంతరం తిరుమలకు వెళ్లేలా వ్యవస్థను అభివృద్ధి చేయనున్నారు.ఈ చర్యల ద్వారా తిరుమలపై ట్రాఫిక్ ఒత్తిడి తగ్గడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు సహకారం అందుతుందని టీటీడీ భావిస్తోంది. భవిష్యత్తులో తిరుమలను పూర్తిస్థాయి గ్రీన్ జోన్గా తీర్చిదిద్దడమే లక్ష్యమని అధికారులు తెలిపారు.
