మే 18, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో ఐదేళ్ల వైసీపీ పాలనలో రైతాంగం తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిందని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. రైతులను అప్పుల ఊబిలోకి నెట్టిన వారే ఇప్పుడు రైతులపై ప్రేమ చూపుతున్నట్లు మాట్లాడటం ఆశ్చర్యకరమని మండిపడ్డారు.వ్యవసాయ రంగాన్ని వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఆయన ఆరోపించారు. సరైన సమయంలో రైతులకు విత్తనాలు, ఎరువులు అందక ఇబ్బందులు ఎదురయ్యాయని, పంటలకు గిట్టుబాటు ధర లేక అనేక మంది రైతులు నష్టపోయారని పేర్కొన్నారు. ‘రైతు భరోసా’ పేరుతో భారీ హామీలు ఇచ్చి, చివరకు పూర్తి స్థాయిలో అమలు చేయకుండా రైతులను మోసం చేశారని అచ్చెన్నాయుడు విమర్శించారు. మామిడి, మొక్కజొన్న రైతులు వైసీపీ హయాంలో ఎదుర్కొన్న ఇబ్బందులను ప్రజలు మర్చిపోలేదన్నారు.కనీస మద్దతు ధర అమలులో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని, రైతులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రచార రాజకీయాలు తప్ప రైతు సంక్షేమంపై వైసీపీకి నిజమైన చిత్తశుద్ధి లేదన్నారు.ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రైతు సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టిందని అచ్చెన్నాయుడు తెలిపారు. పంటల ధరలు, సాగు సమస్యలు, నీటి వనరులు, రైతు సంక్షేమ పథకాలపై నిరంతరం సమీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు.రైతుల కోసం నిజంగా పని చేయాలనే ఉద్దేశం ఉంటే వైసీపీ నేతలు విమర్శలు మానేసి నిర్మాణాత్మక సూచనలు చేయాలని మంత్రి హితవు పలికారు.
