మే 18, (నేటి తెలుగు పత్రిక): వైసీపీ నేతలు తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుని సోషల్ మీడియా రాజకీయాలు చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు.విజయవాడ సమీపంలోని గొల్లపూడిలో మీడియాతో మాట్లాడిన ఆయన, వైసీపీ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిందని అన్నారు. ఐదేళ్లలో అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని మళ్లీ పురోగతి దిశగా తీసుకెళ్తోందని పేర్కొన్నారు.కేవలం 23 నెలల్లోనే భారీ స్థాయిలో పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని, లక్షలాది ఉద్యోగాల కల్పన దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఉమ తెలిపారు. అభివృద్ధి, సంక్షేమాన్ని సమానంగా ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు.పేదల కోసం ప్రారంభించిన అన్న క్యాంటీన్ల ద్వారా కోట్లాది మందికి భోజనం అందించామని గుర్తుచేశారు. గతంలో రహదారుల పరిస్థితిని కూడా పట్టించుకోని వైసీపీ నేతలు ఇప్పుడు అభివృద్ధిపై మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.సోషల్ మీడియా వేదికల ద్వారా ఆరోపణలు చేయడం కంటే మీడియా ముందుకు వచ్చి వాస్తవాలపై చర్చించాలని దేవినేని ఉమ వైసీపీ నేతలకు సవాల్ విసిరారు.
