మే 18, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్లో నిర్మాణంలో ఉన్న గ్రీన్ఫీల్డ్ పోర్టుల పనులను వేగవంతంగా పూర్తి చేయాలని పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణంలో ఎదురయ్యే సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని స్పష్టం చేశారు.సోమవారం సచివాలయంలో గ్రీన్ఫీల్డ్ పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల పురోగతిపై మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని మూడు గ్రీన్ఫీల్డ్ పోర్టులను ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పోర్టుల అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తోందని మంత్రి తెలిపారు. పనులు ఆలస్యం కాకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
మూలపేట పోర్టుపై ప్రత్యేక దృష్టి
మూలపేట పోర్టుకు సంబంధించిన ఉప్పు భూముల సమస్య, రోడ్డు, రైల్వే కనెక్టివిటీ, పునరావాసం వంటి అంశాలను త్వరితగతిన పరిష్కరించాలని మంత్రి ఆదేశించారు. మూలపేట గ్రామ పునరావాస ప్రక్రియ వేగవంతమైతే డ్రెడ్జింగ్ పనులు కూడా త్వరగా పూర్తవుతాయని తెలిపారు.ఈ ఏడాది చివరి నాటికి మూలపేట పోర్టు నిర్మాణాన్ని పూర్తి చేసే అవకాశముందని ఆశాభావం వ్యక్తం చేశారు.
మచిలీపట్నం పోర్టు పనులు వేగవంతం చేయాలి
మచిలీపట్నం గ్రీన్ఫీల్డ్ పోర్టులో బ్రేక్వాటర్, డ్రెడ్జింగ్ పనులను మరింత వేగంగా చేపట్టాలని మంత్రి సూచించారు. రైల్వే అనుసంధానం, విద్యుత్, తాగునీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు.అలాగే రామాయపట్నం పోర్టులో పునరావాసం, డ్రెడ్జింగ్కు సంబంధించిన సమస్యలను త్వరగా పరిష్కరించాలని మంత్రి పేర్కొన్నారు.మూడు గ్రీన్ఫీల్డ్ పోర్టులతో పాటు ఫేజ్-1 ఫిషింగ్ హార్బర్ల పనులను కూడా నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
