మే 18, (నేటి తెలుగు పత్రిక): దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఆధీనంలోని ఆలయాల్లో పనిచేస్తున్న పూజారులు, అర్చకులు, సేవాదార్లు మరియు ఇతర సిబ్బందికి ఏకరీతి వేతన విధానం అమలు చేయాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ అంశంలో కోర్టు జోక్యం చేసుకోవడం సాధ్యం కాదని స్పష్టం చేసింది.జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించేందుకు నిరాకరించింది. ఆలయ సిబ్బందికి వేతనాలు, సంక్షేమ విధానాలు రూపొందించడం ప్రభుత్వాల పరిధిలోని పాలనాపరమైన అంశమని పేర్కొంది.ఈ పిల్ను న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్ దాఖలు చేశారు. ప్రభుత్వ నియంత్రణలో ఉన్న ఆలయాల్లో పనిచేస్తున్న పూజారులు, అర్చకులు, ఇతర సిబ్బందికి కనీస వేతనం, పెన్షన్, ఆరోగ్య భద్రత వంటి సంక్షేమ ప్రయోజనాలు కల్పించాలని ఆయన కోరారు.వేతనాల కోడ్-2019 ప్రకారం ఆలయ సిబ్బందిని కూడా “ఉద్యోగులు”గా గుర్తించాలని పిటిషన్లో పేర్కొన్నారు. ప్రభుత్వాలు ఆలయాల పరిపాలన, ఆదాయం, నియామకాలపై నియంత్రణ కలిగి ఉన్నందున సిబ్బందికి తగిన వేతనాలు, భద్రత కల్పించే బాధ్యత కూడా ప్రభుత్వాలదేనని వాదించారు.పిటిషన్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లోని చిన్న ఆలయాల్లో పనిచేస్తున్న పూజారులు నెలకు రూ.1,000 నుంచి రూ.5,000 వరకు మాత్రమే గౌరవ వేతనాలు పొందుతున్నారని పేర్కొన్నారు. చాలామంది భక్తుల దక్షిణలపైనే ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు.అయితే ఈ అంశంలో నేరుగా ఆదేశాలు ఇవ్వడం కోర్టు పరిధిలోకి రాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. వేతన విధానాలు, సంక్షేమ పథకాలు రూపొందించడం ప్రభుత్వాల విధాన నిర్ణయాలకు సంబంధించిన విషయమని స్పష్టం చేసింది.ఈ తీర్పుతో ఆలయ సిబ్బంది సంక్షేమంపై మరోసారి చర్చ ప్రారంభమైంది. ముఖ్యంగా చిన్న దేవాలయాల్లో పనిచేస్తున్న అర్చకుల ఆర్థిక పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.
