మే 23, (నేటి తెలుగు పత్రిక): వైఎస్సార్ కడప జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేశ్ మానవత్వాన్ని చాటుకున్నారు. అరుదైన జన్యు వ్యాధితో ప్రాణాలతో పోరాడుతున్న 11 నెలల చిన్నారి చికిత్సకు అవసరమైన పూర్తి సహాయాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు.ముద్దనూరు మండలం యామవరం గ్రామానికి చెందిన సాయికుమార్, లక్ష్మీదేవి దంపతుల రెండో కుమారుడు శ్రీవిష్ణు పుట్టిన కొద్ది రోజులకే తీవ్రమైన ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. ప్రతి మూడు వారాలకు ఒకసారి ప్రత్యేక చికిత్స అవసరమవుతుండగా, ఒక్కోసారి సుమారు రూ.16 వేల వరకు ఖర్చవుతోందని కుటుంబ సభ్యులు తెలిపారు.చికిత్స కోసం తమ పొదుపులతో పాటు బంగారు నగలు కూడా అమ్ముకున్న కుటుంబం.. మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని ఆస్పత్రిని సంప్రదించింది. అక్కడ చిన్నారికి శస్త్రచికిత్సతో పాటు దీర్ఘకాలిక చికిత్స అవసరమని, దానికి సుమారు రూ.23 లక్షలు ఖర్చవుతాయని వైద్యులు చెప్పడంతో కుటుంబం ఆందోళనకు గురైంది.ఈ నేపథ్యంలో ముద్దనూరులో నారా లోకేశ్ను కలిసి చిన్నారి పరిస్థితిని తల్లిదండ్రులు వివరించారు. వెంటనే స్పందించిన లోకేశ్.. చికిత్స ఖర్చుల గురించి ఆందోళన చెందవద్దని, అవసరమైన మొత్తం తానే భరిస్తానని భరోసా ఇచ్చారు.మంత్రి హామీతో చిన్నారి తల్లిదండ్రులు భావోద్వేగానికి గురయ్యారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో కూడా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
