మే 23, (నేటి తెలుగు పత్రిక): తెలుగుదేశం పార్టీ మహానాడును ఈసారి రాష్ట్రవ్యాప్తంగా పండుగలా నిర్వహించాలని మంత్రి నారా లోకేశ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ నెల 27, 28 తేదీల్లో జరగనున్న మహానాడును ‘స్త్రీ శక్తి మహానాడు’ థీమ్తో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మహిళా సాధికారత, భద్రత, ఆర్థిక స్వావలంబన వంటి అంశాలకు ఈసారి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు.రాష్ట్రంలోని 1,875 క్లస్టర్ ఇంఛార్జ్లతో నిర్వహించిన ఆన్లైన్ సమావేశంలో లోకేశ్ మాట్లాడారు. అంతర్జాతీయ పరిస్థితులు, ఇంధన పొదుపు అవసరాల దృష్ట్యా ఈసారి మహానాడును హైబ్రిడ్ విధానంలో రెండు రోజులపాటు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రధాన కార్యక్రమం జరుగుతుండగా, రాష్ట్రవ్యాప్తంగా క్లస్టర్ కేంద్రాల్లో కార్యకర్తలు వర్చువల్గా పాల్గొంటారని తెలిపారు.ప్రతి కేంద్రంలో ఎల్ఈడీ టీవీలు, సౌండ్ సిస్టమ్, ఇంటర్నెట్ వంటి సాంకేతిక సదుపాయాలు సక్రమంగా ఉండేలా చూడాలని సూచించారు. పార్టీ జెండాలు, బ్యానర్లు, అలంకరణలతో మహానాడు వేదికలను పండుగలా తీర్చిదిద్దాలని కోరారు. కార్యకర్తల ఐక్యత, పార్టీ బలాన్ని చాటే వేదికగా మహానాడు నిలవాలని లోకేశ్ ఆకాంక్షించారు.
