మే 23, (నేటి తెలుగు పత్రిక): వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రజల ముందు అమాయకుడిలా, అహింసావాదిలా మాట్లాడుతున్న జగన్ అసలు వ్యక్తిత్వం రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసని అన్నారు. కుటుంబ వ్యవహారాల నుంచి రాజకీయాల వరకు ఆయన తీరు వివాదాస్పదంగానే ఉందని ఆరోపించారు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన మంత్రి అనగాని.. జగన్ కుటుంబ రాజకీయ చరిత్ర, రాయలసీమ రాజకీయాలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. “రాయలసీమలో ఏ గడప తట్టినా జగన్ కుటుంబ రాజకీయాల గురించి చెబుతారు. ఎన్ని దారుణాలు జరిగాయో ప్రజలకు తెలుసు” అంటూ విమర్శించారు. “రాజారెడ్డి రాజ్యాంగం” అనే పదాన్ని ప్రస్తావిస్తూ గత రాజకీయ పరిణామాలపై కూడా ఆయన వ్యాఖ్యానించారు.ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని వ్యాపార, రాజకీయ ప్రయోజనాల కోసం అనేక ఘటనలు జరిగాయని ఆరోపించిన అనగాని.. పరిటాల రవి హత్యతో పాటు పలు కేసులను ప్రస్తావించారు. అమరనాథ్ గౌడ్, సుధాకర్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం వంటి ఘటనలపై కూడా ప్రశ్నలు లేవనెత్తారు.కుటుంబ విషయాలపైనా మంత్రి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “ఆస్తి కోసం తల్లిని, చెల్లిని కూడా దూరం చేసిన వ్యక్తిత్వం జగన్ది” అంటూ ఆరోపించారు. కుటుంబ విభేదాలు ఇప్పుడు ప్రజల ముందే కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును ప్రస్తావిస్తూ, సీబీఐ దర్యాప్తు సమయంలో అధికారులను అడ్డుకున్నారంటూ మండిపడ్డారు. వైఎస్ సునీత ఆవేదనను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని, ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ వివేకా హత్య కేసులో నిజాలు బయటపెట్టలేకపోయారని అనగాని ప్రశ్నించారు. “ప్రజలను తప్పుదోవ పట్టించే రోజులు పోయాయి. ఇప్పుడు ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారు” అన్నారు.ప్రస్తుతం రాష్ట్రంలో అభివృద్ధి, పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన వేగంగా జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ మళ్లీ పురోగతి దిశగా సాగుతోందని పేర్కొన్నారు. “యువతలో కొత్త ఆశలు కనిపిస్తున్నాయి. పెట్టుబడులు వస్తున్నాయి. పరిశ్రమలు ఏర్పడుతున్నాయి. ప్రజలు సంతోషంగా ఉన్నారు” అని చెప్పారు.రాబోయే రోజుల్లో వైసీపీకి ప్రజల్లో మరింత వ్యతిరేకత పెరుగుతుందని, గత ఎన్నికల్లో వచ్చిన ఫలితాల కంటే ఇంకా కఠిన పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉందని మంత్రి అనగాని సత్యప్రసాద్ వ్యాఖ్యానించారు.
