మే 23, (నేటి తెలుగు పత్రిక): విశాఖపట్నంలో చోరీలు, సైబర్ నేరాలపై పోలీసులు కఠిన చర్యలు కొనసాగిస్తున్నారు. నేరాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు బాధితులకు త్వరితగతిన న్యాయం అందించాలనే లక్ష్యంతో విశాఖ పోలీస్ కమిషనరేట్ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఈ క్రమంలో నిర్వహించిన “రికవరీ మేళా”లో భారీ స్థాయిలో స్వాధీనం చేసుకున్న ఆస్తులను బాధితులకు తిరిగి అప్పగించారు.ఏప్రిల్ నెలలో కమిషనరేట్ పరిధిలో నమోదైన 68 చోరీ కేసుల్లో 51 కేసులను పోలీసులు విజయవంతంగా ఛేదించారు. అత్యాధునిక సాంకేతికత, సీసీటీవీ ఫుటేజ్ విశ్లేషణ, ప్రత్యేక నిఘా బృందాల సహకారంతో నిందితులను గుర్తించిన పోలీసులు మొత్తం 60 మందిని అరెస్టు చేశారు.ఈ కేసులకు సంబంధించి రూ.1.04 కోట్ల విలువైన ఆస్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో 924 గ్రాములకుపైగా బంగారం, 4.5 కిలోల వెండి, రూ.3 లక్షలకు పైగా నగదు ఉన్నాయి. ఈ సొత్తును విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి బాధితులకు అధికారికంగా అందజేశారు.ఈ సందర్భంగా మాట్లాడిన సీపీ శంఖబ్రత బాగ్చి.. గత 22 నెలల్లో విశాఖ పోలీస్ కమిషనరేట్ పనితీరు గణనీయంగా మెరుగుపడిందన్నారు. ఈ కాలంలో మొత్తం 9,202 మంది బాధితులకు సుమారు రూ.22 కోట్ల విలువైన సొత్తును తిరిగి అప్పగించినట్లు వెల్లడించారు. “బాధితుడికి కోల్పోయిన ఆస్తి తిరిగి అందించడమే పోలీసింగ్లో నిజమైన సంతృప్తి” అని ఆయన పేర్కొన్నారు.ఇటీవల నగరంలో సంచలనం రేపిన హనీట్రాప్ కేసుపై కూడా సీపీ స్పందించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నామని, దీనికి వెనుక మరెవరైనా ఉన్నారా అనే దిశగా లోతుగా దర్యాప్తు కొనసాగుతోందన్నారు.అలాగే సైబర్ నేరాలపై ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఆన్లైన్ లోన్ యాప్లు, పార్ట్టైమ్ ఉద్యోగాల పేరుతో జరుగుతున్న మోసాలు పెరుగుతున్నాయని తెలిపారు. సోషల్ మీడియా లేదా ఆన్లైన్ ద్వారా బ్లాక్మెయిల్, బెదిరింపులు ఎదురైనా భయపడకుండా వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు.జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ సేవలను ప్రజలు వినియోగించుకోవాలని సీపీ కోరారు. డిజిటల్ మోసాల నివారణలో ప్రజల అప్రమత్తత కూడా కీలకమని ఆయన స్పష్టం చేశారు.విశాఖ పోలీసులు తీసుకుంటున్న వేగవంతమైన చర్యలపై బాధితులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చోరీలకు పాల్పడే నేరస్థులపై ఇలాగే కఠిన చర్యలు కొనసాగించాలని నగరవాసులు కోరుతున్నారు.
