మే 25, (నేటి తెలుగు పత్రిక): ఇంధన ధరల పెంపుపై కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా విమర్శించారు. పెట్రోల్, డీజిల్ ధరలను విడతల వారీగా పెంచుతూ ప్రజలపై భారీ భారం మోపుతున్నారని ఆరోపించారు.సోషల్ మీడియా వేదికగా స్పందించిన రాహుల్ గాంధీ.. ప్రధాని నరేంద్రమోదీని ఉద్దేశిస్తూ “ద్రవ్యోల్బణ సూత్రధారి” అంటూ విమర్శలు గుప్పించారు. నిశ్శబ్దంగా ఇంధన ధరలు పెంచుతూ ప్రజల జేబులు ఖాళీ చేస్తున్నారని అన్నారు.దేశంలో ఆర్థిక సంక్షోభ పరిస్థితులు వస్తాయని తాను ముందుగానే హెచ్చరించినప్పటికీ.. ప్రధాని మాత్రం ఎన్నికల రాజకీయాల్లోనే బిజీగా ఉన్నారని రాహుల్ ఎద్దేవా చేశారు. ఎన్నికలు ముగిసిన వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలను సుమారు రూ.8 వరకు పెంచారని ఆరోపించారు.ఇంధన ధరల పెంపు ప్రభావం అన్ని వర్గాల ప్రజలపై పడుతోందని, ముఖ్యంగా సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి, తర్వాత ధరల భారం మోపడం కేంద్ర ప్రభుత్వానికి అలవాటైందని విమర్శించారు.
