మే 26, (నేటి తెలుగు పత్రిక): తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన రెండో రోజు కొనసాగింది. రాజమండ్రి రూరల్ మండలం వెంకట్నగరం గ్రామంలో ఆంధ్రా పేపర్ మిల్లు నుంచి వెలువడుతున్న వ్యర్థ జలాలు గోదావరిలో కలుస్తున్న ప్రాంతాలను పవన్ పరిశీలించారు.బోటులో ప్రయాణిస్తూ కాలుష్య ప్రభావిత లంక ప్రాంతాలను పరిశీలించిన డిప్యూటీ సీఎం.. స్థానిక మత్స్యకారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గోదావరి జలాల కాలుష్యం వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.నదీ కాలుష్య నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, వ్యర్థ జలాల నియంత్రణకు తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. ఈ పర్యటనలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
