మే 26, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో ఎక్కడైనా విద్యుత్ సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కరించేందుకు 1912 టోల్ ఫ్రీ నంబర్ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. వాతావరణ మార్పులు, అధిక ఉష్ణోగ్రతలు, ఈదురుగాలుల కారణంగా కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయాలు ఏర్పడుతున్నాయని చెప్పారు.అమరావతిలో మీడియాతో మాట్లాడిన మంత్రి, 48 డిగ్రీలకుపైగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో విద్యుత్ వినియోగం భారీగా పెరిగిందన్నారు. ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నప్పుడు విద్యుత్ పునరుద్ధరణకు 2 నుంచి 4 గంటల సమయం పడుతుందని వివరించారు. తీవ్ర ఎండల్లో కూడా విద్యుత్ సిబ్బంది ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్నారని కొనియాడారు.ఈదురుగాలుల వల్ల హోర్డింగ్లు, విద్యుత్ తీగలపై చెట్లు పడటంతో సమస్యలు వస్తున్నాయని తెలిపారు. అనుమతులు లేని హోర్డింగ్ల తొలగింపుపై మున్సిపల్ శాఖతో కలిసి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. టోల్ ఫ్రీ సేవ ద్వారా ప్రజలకు సమస్యలపై ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తామని వెల్లడించారు.రాష్ట్ర అవసరాలకు సరిపడా విద్యుత్ ఉన్నప్పటికీ ట్రాన్స్మిషన్ సమస్యల వల్ల అంతరాయాలు వస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దఎత్తున సబ్స్టేషన్ల నిర్మాణం చేపట్టిందని, సెప్టెంబర్ నాటికి 30 సబ్స్టేషన్లు పూర్తవుతాయని తెలిపారు.
