మే 31, (నేటి తెలుగు పత్రిక): దేశవ్యాప్తంగా పలుచోట్ల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో తగినంత నీరు తాగుతూ జాగ్రత్తలు పాటించాలని కోరారు.మధ్యాహ్న వేళల్లో అవసరం లేకుండా బయటకు వెళ్లకుండా ఉండాలని, వేడి ప్రభావం నుంచి రక్షణ పొందేందుకు స్థానికంగా ప్రాచుర్యం పొందిన సంప్రదాయ పానీయాలను తీసుకోవాలని సూచించారు. లస్సీ, సత్తూ శర్బత్, పానకం, మజ్జిగ వంటి పానీయాలు శరీరానికి చల్లదనాన్ని అందించడంతో పాటు ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.వివిధ రాష్ట్రాల ప్రత్యేక పానీయాలు దేశ సంస్కృతి వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తాయని, వాటిని ఆస్వాదించడం ద్వారా ‘ఏక్ భారత్ – శ్రేష్ఠ భారత్’ స్ఫూర్తి మరింత బలపడుతుందని ప్రధాని తెలిపారు. ప్రజలు వేసవి కాలంలో ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు పాటిస్తూ సంప్రదాయ పానీయాలను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
