తెలంగాణ ప్రభుత్వ గురుకులాలపై ప్రత్యేక దృష్టి
యాదాద్రి భువనగిరి, డిసెంబర్ 14:
తెలంగాణ రాష్ట్రంలోని సంక్షేమ వసతి గృహాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు మరియు ఆహార నాణ్యతపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో గురుకుల హాస్టళ్లపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. నేరుగా సమస్యలు తెలుసుకునేందుకు మంత్రులు, ఐపీఎస్ అధికారులు రంగంలోకి దిగనున్నారు.
ఈ నేపథ్యంలో ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల ఎంఎల్సీ తీన్మార్ మల్లన్న ఈ రోజు రాజాపేట మండలంలో ఉన్న టీజీడబ్ల్యూఆర్ఎస్ బాయ్స్ సంక్షేమ హాస్టల్ను తనిఖీ చేశారు. తనిఖీల సందర్భంగా విద్యార్థులతో ముచ్చటించిన మల్లన్న, హాస్టల్లో వారికి అందిస్తున్న ఆహారాన్ని ముందుగా రుచి చూశారు. అనంతరం కొత్తగా ప్రవేశపెట్టిన డైట్ మెనూను పరిశీలించి, ఆహార నాణ్యతను గమనించారు.
తన ప్రసంగంలో మల్లన్న మాట్లాడుతూ, “విద్యార్థులకు కావాల్సిన పోషక ఆహారంలో ఎక్కడా రాజీ పడకుండా చర్యలు తీసుకుంటాం. పాఠశాలల్లో లేదా హాస్టల్లో ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా నా దృష్టికి లేదా ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య దృష్టికి తీసుకురండి,” అని విద్యార్థులకు హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో హాస్టల్ యాజమాన్యం, ప్రత్యేకాధికారులు, మండల అధికారులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. నూతన చర్యలతో విద్యార్థుల ఆరోగ్యం, సంక్షేమం పట్ల ప్రభుత్వం కట్టుదిట్టమైన విధానాలను అమలు చేయాలని ఉద్దేశిస్తోంది.
