మార్చి 29, నేటి తెలుగు పత్రిక: పశ్చిమ ఆసియాలో క్షీణిస్తున్న పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన అనధికారిక మంత్రుల సాధికార బృందం (IGoM) తొలి సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు మరియు మంత్రి జె.పి. నడ్డా సహా పలువురు కీలక మంత్రులు పాల్గొన్నారు.పశ్చిమ ఆసియా సంక్షోభం భారతదేశంపై చూపే ప్రభావంపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా ఇంధన సరఫరా, ఆర్థిక పరిస్థితులు, సరఫరా గొలుసులు, జాతీయ భద్రత వంటి కీలక అంశాలపై సమీక్ష జరిగింది.
ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, మధ్యకాలిక, దీర్ఘకాలిక సన్నద్ధతపై దృష్టి పెట్టాలని సూచించారు. అన్ని మంత్రిత్వ శాఖలు అప్రమత్తంగా ఉండి పరస్పర సమన్వయంతో వేగంగా నిర్ణయాలు తీసుకోవాలని ఆదేశించారు. ఏ పరిస్థితినైనా సమర్థంగా ఎదుర్కొనేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.అలాగే రాష్ట్ర, జిల్లా స్థాయి యంత్రాంగాలతో సమన్వయం మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు. ప్రజలకు సకాలంలో సరైన సమాచారం అందించడంతో పాటు, వదంతులు, ఫేక్ న్యూస్ను అరికట్టడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.సమావేశం అనంతరం రక్షణ మంత్రి పేర్కొంటూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజల భద్రత, ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడటానికి కట్టుబడి ఉందని తెలిపారు. పశ్చిమ ఆసియా పరిస్థితుల ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు భారత్ అన్ని విధాలుగా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
