మార్చి 31, నేటి తెలుగు పత్రిక: తిరుపతి జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. సోషల్ మీడియా రీల్స్ తీసే క్రమంలో ఓ 13 ఏళ్ల బాలిక ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన అలిపిరి పోలీస్స్టేషన్ పరిధిలోని రాజారెడ్డి నగర్లో జరిగింది.నేపాల్కు చెందిన ధను బహదూర్ కుటుంబం జీవనోపాధి కోసం తిరుపతికి వచ్చి, సాయి నివాస్ అపార్ట్మెంట్లో నివసిస్తోంది. అక్కడే వాచ్మన్గా పని చేస్తున్న ఆయన కుమార్తె పుష్ప (13) మొబైల్తో రీల్స్ వీడియో తీయడానికి ఐదవ అంతస్తుకు వెళ్లింది. ఈ సమయంలో ఆమె నియంత్రణ కోల్పోయి కింద పడిపోయింది.కొంతసేపటికి కూతురు కనిపించకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు వెతకగా, అపార్ట్మెంట్ ప్రాంగణంలో తీవ్రంగా గాయాలతో పడి ఉన్న పుష్పను గుర్తించారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. చిన్నారులు సోషల్ మీడియా వినియోగంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
