మార్చి 31, నేటి తెలుగు పత్రిక: గ్యాస్ వినియోగదారుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. 5 కేజీల చిన్న ఎల్పీజీ సిలిండర్ను అందుబాటులోకి తీసుకొచ్చి, గ్యాస్ పొందడాన్ని మరింత సులభం చేసింది. ఇప్పటివరకు గ్యాస్ సిలిండర్ కోసం ముందుగా బుకింగ్ చేసి, డెలివరీ కోసం వేచి ఉండాల్సిన పరిస్థితి ఉండేది. అయితే ఈ కొత్త విధానంలో అలాంటి అవసరం లేదు. వినియోగదారులు నేరుగా సమీప గ్యాస్ ఏజెన్సీకి వెళ్లి సిలిండర్ను వెంటనే పొందవచ్చు.ఈ సిలిండర్ ఫ్రీ ట్రేడ్ ఎల్పీజీ కేటగిరిలో ఉండటంతో, కేవలం ఒక గుర్తింపు కార్డు చూపిస్తే సరిపోతుంది. అడ్రస్ ప్రూఫ్ లేదా ఇతర పత్రాలు అవసరం లేదు. అంతేకాదు, రీఫిల్ కోసం ఒకే డిస్ట్రిబ్యూటర్ వద్దకు పరిమితం కాకుండా, ఎక్కడైనా సులభంగా గ్యాస్ నింపించుకునే అవకాశం ఉంది.ఇండేన్ డిస్ట్రిబ్యూటర్లు, అనుమతిపొందిన అవుట్లెట్లు, కొన్ని కిరాణా దుకాణాల్లో కూడా ఈ సిలిండర్ లభిస్తుంది. దీంతో అత్యవసర సమయంలో గ్యాస్ కొరతతో ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా, వెంటనే పరిష్కారం లభిస్తుంది.ప్రత్యేకంగా వలస కార్మికులు, చిన్న కుటుంబాలు, తరచూ నివాసం మారే వారికి ఈ చిన్న సిలిండర్ ఎంతో ఉపయోగకరంగా మారనుందని సంస్థ వర్గాలు పేర్కొంటున్నాయి.
