ఏప్రిల్ 17, నేటి తెలుగు పత్రిక: దేశవ్యాప్తంగా బీసీ వర్గాల హక్కుల కోసం ఉద్యమం ఉద్ధృతమవుతోంది. గల్లీ నుంచి ఢిల్లీ వరకు బీసీ నినాదాలు మార్మోగుతుండగా, మహిళా రిజర్వేషన్లో ఓబీసీ మహిళలకు ప్రత్యేక సబ్ కోటా కల్పించాలని డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహించగా, మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని నాయకులు కోరుతున్నారు. లోక్సభలో జరిగిన చర్చల్లో కూడా ఈ అంశం ప్రాధాన్యం సంతరించుకుంది. తెలంగాణలో బీసీ గణన నివేదికపై రాజకీయంగా వాదోపవాదాలు జరుగుతున్నాయి. సమగ్ర సర్వే దేశవ్యాప్తంగా కుల గణన అవసరంపై చర్చకు దారితీసిందని కొందరు నేతలు పేర్కొంటుండగా, మరికొందరు దానిలో లోపాలు ఉన్నాయని విమర్శిస్తున్నారు.ఇక ఆంధ్రప్రదేశ్లో కూడా బీసీ హక్కుల కోసం ఉద్యమాలు కొనసాగుతున్నాయి. ఈ నెల 26న అనంతపురంలో నిర్వహించనున్న బీసీ గళం సమావేశానికి రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది. మొత్తంగా బీసీల ప్రాతినిధ్యం, హక్కుల అంశం దేశ రాజకీయాల్లో ప్రధాన చర్చగా మారుతోంది.
