శ్రీతేజను పరామర్శించిన మందకృష్ణ మాదిగ
సంధ్య థియేటర్ ఘటనపై సినీ ప్రముఖుల స్పందనపై ఆగ్రహం
హైదరాబాద్:
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజను ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పరామర్శించారు. ఈ ఘటనపై ఇప్పటివరకు సినీ ప్రముఖులు లేదా ప్రజా ప్రతినిధులు స్పందించకపోవడం శోచనీయమని మండిపడ్డారు.
మందకృష్ణ మాదిగ శ్రీతేజను పరామర్శించి, అతనికి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “సంధ్య థియేటర్ ఘటన బాధాకరం. సినీ రంగానికి జీవితాలు అర్పిస్తున్న అభిమానుల విషయంలోనూ బాధ్యతగా వ్యవహరించాలి. అల్లు అర్జున్ వంటి ప్రముఖ నటులు బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలి” అని అన్నారు.
శ్రీతేజ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించేందుకు అల్లు అర్జున్ ముందుకు రావాలని, బాధిత కుటుంబానికి రూ.కోటి పరిహారం అందించాలని మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. బాలుడు శ్రీతేజ, అతని సోదరి చదువు ఖర్చులు భరించాల్సిన బాధ్యత అల్లు అర్జున్ తీసుకోవాలని సూచించారు.
ఈ ఘటనపై మరింత మంది సినీ ప్రముఖులు స్పందించి బాధిత కుటుంబానికి సహాయం చేయాలని మందకృష్ణ పిలుపునిచ్చారు.
