పదేళ్లు బీఆర్ఎస్ విధ్వంసం చేసింది: కోమటిరెడ్డి వెంకటరెడ్డి
బీఆర్ఎస్పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఈ సందర్బంగా ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. తెలంగాణలో పదేళ్లు బీఆర్ఎస్ పాలన విధ్వంసం చేసిందని, ఉప్పల్ ఫ్లై ఓవర్ను ఆరున్నర ఏళ్ళు అయినా పూర్తి చేయలేదని, ఏడు కిలోమీటర్లు పిల్లర్స్ లేసి స్లాబ్ వేయకుండా వదిలేశారని మంత్రి ఆరోపించారు. ఆనాడు పైసలు వచ్చే కాలేశ్వరం మీద తప్ప రోడ్లమీద బీఆర్ఎస్కు ధ్యాస లేదని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ కే అన్ని వైపుల నుంచి రూ. 700 కోట్లతో రోడ్లు వేసుకున్నారని విమర్శించారు.
విజయవాడ హైవేను సిక్స్ లైన్ రోడ్డుగా మార్చేందుకు డీపీఆర్ (DPR) సిద్ధమవుతోందని, అప్పుడు ప్రశాంత్ రెడ్డి మంత్రిగా పనిచేసి ఉంటే ఇప్పుడు మాకు పని ఉండేదా అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు. హరీష్ రావుకు దబాయించడం మాత్రమే తెలుసునని.. కూలిపోయే కాలేశ్వరం కట్టి కమిషన్ తీసుకోవడం తెలుసునని.. రూ. లక్ష కోట్లు విలువచేసే ఓఆర్ఆర్ (ORR)ను అమ్ముకున్నారని ఆరోపించారు. వచ్చే మార్చి నాటికి భూసేకరణ పూర్తి చేసి రీజినల్ రింగ్ రోడ్డు పనులు ప్రారంభిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు.
