ఎమ్మెల్సీ కవిత నివాసంలో బీసీ సంఘాల సమావేశం ముగింపు
బీసీల రిజర్వేషన్లపై ఉద్యమానికి తెలంగాణ జాగృతి సిద్దం
హైదరాబాద్:
బంజారా హిల్స్లోని ఎమ్మెల్సీ కవిత నివాసంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బీసీ సంఘాల సమావేశం జరిగింది. ప్రారంభంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల రెండు నిమిషాల మౌనం పాటించి నివాళులర్పించారు.
సమావేశంలో కామారెడ్డి డిక్లరేషన్ పై చర్చించి, స్థానిక సంస్థలలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.
సమావేశం అనంతరం ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ, గ్రామీణ స్థాయిలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మొదలైందని, అయితే బీసీల రిజర్వేషన్లు నిర్ణయించకుండానే ఎన్నికలు నిర్వహించడం సరైనది కాదని అభిప్రాయపడ్డారు. 42% రిజర్వేషన్లు కల్పించడం కాంగ్రెస్ హయాంలో చెప్పిన విధంగానే చేయాల్సిందిగా డిమాండ్ చేశారు.
రిజర్వేషన్లపై తగిన చర్యలు తీసుకోకుండా ఎన్నికలు నిర్వహిస్తే, బీసీ సంఘాలు తమ కార్యాచరణను మార్చుకుంటాయని హెచ్చరించారు. 2025 జనవరి 3న ఇందిరా పార్క్ వద్ద భారీ సభ నిర్వహించి, తమ పూర్తి స్థాయి కార్యాచరణను ప్రకటిస్తామని కవిత ప్రకటించారు.
ఈ సమావేశంలో బీసీ సంఘాల నేతలు, తెలంగాణ జాగృతి సభ్యులు పాల్గొన్నారు.
