మెదక్: ప్రభుత్వం లేదా అధికారిక సంస్థల అనుమతులు లేకుండానే, ‘కలం’ వంటి పేర్లతో నకిలీ న్యూస్ పేపర్లు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నట్లు వెలుగుచూస్తోంది. నిబంధనలు లేకుండా ప్రచారంలోకి వస్తున్న ఈ నకిలీ పత్రికలు, నిజమైన అనుమతులు కలిగిన పత్రికలకు చెడ్డపేరు తెస్తున్నాయని స్థానిక మీడియా ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇష్టానుసారంగా వార్తలు ప్రచురిస్తూ, పేపర్ కట్టింగ్లను పంపిస్తూ ప్రజల్లో చలామణి అవుతున్న నకిలీ పత్రికలపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని మీడియా సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ ఘటనపై సమాచార శాఖ మంత్రి, ఐ అండ్ పిఆర్ కమిషనర్, ప్రెస్ అకాడమీ చైర్మన్, ప్రెస్ కౌన్సిల్, సోమాజిగూడ ప్రెస్ క్లబ్లకు ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం.
నకిలీ పత్రికల ప్రభావం
నకిలీ న్యూస్ పేపర్లు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని, అధికారిక అనుమతులు లేకుండా వార్తలు ప్రచురించడం వల్ల సమాజంలో గందరగోళం నెలకొంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అనుమతులేని ఈ పత్రికలు మీడియా రంగంలో నిజాయితీ, విశ్వసనీయతకు భంగం కలిగిస్తున్నాయి.
కఠిన చర్యలు అవసరం
అనుమతులు కలిగిన పత్రిక యాజమానులు, నకిలీ న్యూస్ పేపర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు. ఇకపై ఇలాంటి అక్రమ ప్రచారాలను అడ్డుకునేందుకు కఠినమైన నిబంధనలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మీడియా రంగంలో నైతిక విలువలు, విశ్వసనీయతను కాపాడుకోవడం కీలకమని పత్రిక యాజమానులు స్పష్టం చేస్తున్నారు.ఇలాంటి నకిలీ ప్రచారాలను అడ్డుకోవడానికి ప్రభుత్వం త్వరితగతిన చర్యలు తీసుకోవాలని మీడియా వర్గాలు కోరుతున్నాయి.
