బిఆర్ఎస్ రోజుకో వేషం, డ్రామా.. అవసరమా? మంత్రి పొన్నం ప్రభాకర్ ఎద్దేవా
తెలంగాణ శాసనసభ సమావేశాలకు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు రోజూ వేషాలు వేసి డ్రామాలు చేస్తున్నారని, మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు.
బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఒక రోజు ‘రాహుల్ గాంధీ-అదానీ బాయ్ బాయ్’ అని వారి బొమ్మలతో టీ షర్ట్స్ వేసుకుని శాసనసభకు రాగానే పోలీసులు వారిని అడ్డుకున్నారు. తరువాత, లగచర్ల రైతు హీర్యా నాయక్ బేడీలు వేసి ఆస్పత్రికి తీసుకెళ్లడాన్ని నిరసిస్తూ, మంగళవారం నల్ల దుస్తులు, చేతులకు బేడీలు ధరించి శాసనసభకు వచ్చారు.
ఇటీవల, వారు ఆటో డ్రైవర్ల యూనిఫారమ్ (కాకీ చొక్కాలు) ధరించి శాసనసభకు చేరుకున్నారు. బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా ఓ ఆటో రిక్షాను నడిపిస్తూ కొంతమంది ఎమ్మెల్యేలతో శాసనసభకు చేరుకున్నారు. వారు ప్లకార్డులతో ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని నినాదాలు చేస్తూ శాసనసభలోకి ప్రవేశించారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ, “బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు శాసనసభ సమావేశాలను చులకనగా భావిస్తున్నట్లుగా ఉన్నారు. అందుకే రోజూ కొత్త వేషాలు వేసి, శాసనసభలో డ్రామాలు చేస్తున్నారు” అని అన్నారు.
అలాగే, “బిఆర్ఎస్ పార్టీ పదేళ్లుగా అధికారంలో ఉంది. ఆర్టీసీ కార్మికుల, ఆటో డ్రైవర్ల సమస్యలపై ఎప్పుడైనా ఈ ప్రభుత్వం పట్టించుకున్నదా? ఇప్పుడు వాటి గురించి మొసలి కన్నీళ్లు కారుస్తూ, వారి గోడు విందా?” అని ఆయన ఎద్దేవా చేశారు.
“బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల భారం ఎక్కువగా ఉండటం వలన ఆటో డ్రైవర్లకు ఇచ్చే రూ.12,000 అందించలేకపోయాం. కానీ వచ్చే ఏడాది తప్పకుండా ఇస్తాం,” అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
