మహిళల ఉచిత బస్సు ప్రయాణం: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం అందించేందుకు మరో కీలక చర్య తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన “సూపర్ 6 హామీల్లో” ఒకటైన ఈ పథకం, రానున్న సంక్రాంతి నుంచి అమలులోకి రావచ్చని సమాచారం. ఈ మేరకు ప్రభుత్వం మంత్రి వర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది.
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నేతృత్వంలో ఉప సంఘం ఏర్పాటు చేయబడింది. హోం మంత్రి అనిత, గిరిజన, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఈ ఉప సంఘంలో సభ్యులుగా నియమించబడ్డారు. రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ఈ ఉప సంఘం కవినర్గా విధులు నిర్వహించనున్నారు.
ఉచిత బస్సు ప్రయాణం పథకం ఇప్పటికే ఇతర రాష్ట్రాలలో అమలులో ఉన్న సందర్భంలో, ఈ ఉప సంఘం త్వరలోనే ఆ రాష్ట్రాలలో జరిగిన అధ్యయనాలను తీసుకుని నివేదిక సమర్పించనుంది. మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పాటు సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి సత్వర నివేదిక ఇవ్వడానికి కృషి చేస్తామని వెల్లడించారు.
ఈ పథకం అమలుకు సంబంధించి, సంక్రాంతి సమయంతోనే ఉచిత ప్రయాణం ప్రారంభమవుతుందని, ఆర్టీసీ సంస్థకు కావలసిన ఏర్పాట్లు చేస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.
ఆర్టీసీ డిపోల సమూల మార్పులు:

ఈ రోజు పార్వతీపురం మన్యం జిల్లా లో, ఆర్టీసీ పథకాలు మరింత విస్తరించేందుకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఆరు కొత్త ఆర్టీసీ బస్సుల సర్వీసులను ప్రారంభించారు. ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఆర్టీసీలో ఉత్తమ సేవలు అందించిన కార్మికులకు నగదు బహుమతులు ఇచ్చి, మరిన్ని నూతన ఆర్టీసీ డిపో భవనాలు మరియు స్పోర్ట్స్ మైదానం ఏర్పాటు చేయాలన్న హామీని మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఇచ్చారు.
