బీసీ రిజర్వేషన్లపై కవిత డ్రామాలు: ఆది శ్రీనివాస్ విమర్శలు
బీసీ రిజర్వేషన్లపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యవహార శైలిపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శలు గుప్పించారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన, “బీసీలతో కవితకు ఏ సంబంధం? బీసీలపై ఆమె చూపిస్తున్న కపట ప్రేమను ప్రజలు గుర్తించాలి” అని వ్యాఖ్యానించారు.
బీసీల సమస్యలు పరిష్కారానికి కవిత అవసరమా?
“బీసీల సమస్యలపై పోరాడే శక్తి బీసీలకే ఉంది. కవిత నాయకత్వం మనకు అవసరం లేదు. పదేళ్లపాటు అధికారంలో ఉన్నప్పుడే కవిత బీసీల గురించి మాట్లాడిందా?” అని ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. తెలంగాణలో కులగణనతో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించారని, రాష్ట్రం ఈ విషయంలో దేశానికి రోల్ మోడల్గా నిలిచిందని పేర్కొన్నారు.
కులగణనపై ప్రశ్నలు
“రాహుల్ గాంధీ సూచనలతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కులగణన చేపట్టారు. అయితే, గిరిజనులు, మైనార్టీలకు 12% రిజర్వేషన్లు ఇస్తామన్న కేసీఆర్ అప్పట్లో బీసీల గురించి ఎందుకు మాట్లాడలేదు? బీసీ కార్పొరేషన్లు, ఇతర కార్పొరేషన్లను నిర్వీర్యం చేయడం ద్వారా బీసీలను పట్టించుకోలేదని విమర్శించారు. ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసినా నిధులులేకుండా దాని పనితీరును అణగదోస్తున్నారని పేర్కొన్నారు.
కవిత సభపై ఆగ్రహం
కవిత డిసెంబర్ 3న బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ప్రకటించడంపై ఆది శ్రీనివాస్ విరుచుకుపడ్డారు. “కవిత ఎవరు? బీసీ రిజర్వేషన్లపై బహిరంగ సభ నిర్వహించేందుకు ఆమె హక్కు ఏది?” అని ప్రశ్నించారు. బీసీలందరికీ ఆమె సభకు హాజరుకావొద్దని పిలుపునిచ్చారు.
లిక్కర్ కేసు అంశంపై విమర్శలు
“లిక్కర్ కుంభకోణం నుంచి జన దృష్టి మళ్లించేందుకు కవిత బీసీ డ్రామాలు ఆడుతున్నారు. ఆరు నెలలు జైలులో ఉండొచ్చిన వ్యక్తి బీసీలకు నాయకత్వం వహించడం అవసరం లేదు. బీసీ రిజర్వేషన్లపై న్యాయం చేసే శక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే ఉంది” అని శ్రీనివాస్ స్పష్టం చేశారు.
తెరపై రాజకీయ విమర్శలు
కవితపై తన వ్యాఖ్యలను కొనసాగిస్తూ, “అగ్రకులాల చెప్పు చేతల్లో ఉద్యమాలు చేయాల్సిన కర్మ బీసీలకు లేదు. రిజర్వేషన్లు పెంచకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లడం కవిత ఆరోపణల్లో నిజం లేదు” అని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. కవిత నాయకత్వం బీసీలకు అవసరం లేదని, రాజకీయ కక్ష్యతో డ్రామాలు ఆడుతున్నారని ఆయన విమర్శించారు.
