ఏపీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు: ట్రాఫిక్ చలాన్ల పై కఠిన ఆదేశాలు
అమరావతి:
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించేవారిపై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరమని చెప్పింది. ట్రాఫిక్ చలాన్లు కట్టనివారికి విద్యుత్, నీటి సరఫరా నిలిపివేయాలని సూచించి సంచలన వ్యాఖ్యలు చేసింది.
సీట్ బెల్ట్, హెల్మెట్ పై గట్టి దృష్టి
హైకోర్టు వివిధ ట్రాఫిక్ నిబంధనలు అమలు చేయడంలో పోలీసుల నిర్లక్ష్యం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది.
“ఏపీ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహన డ్రైవర్లు, తెలంగాణ సరిహద్దుకు చేరుకున్నాకే సీట్ బెల్ట్లు పెట్టుకుంటున్నారు. ఏపీ పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి,” అని కోర్టు వ్యాఖ్యానించింది.
హెల్మెట్ ధరించకపోవడం వల్ల మూడు నెలల్లో 667 మంది మరణించారని, ఇది తీవ్ర ఆందోళన కలిగించిందని పేర్కొంది.
పిటిషన్పై విచారణ:
రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయని, నిబంధనలు సరైన విధంగా అమలు చేయడం లేదని దాఖలైన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది.
ట్రాఫిక్ చలాన్ల సకాలంలో చెల్లింపులు చేయించడంలో ప్రభుత్వం విఫలమవుతోందని న్యాయస్థానం అభిప్రాయపడింది.
ప్రజల భద్రతను నిర్లక్ష్యం చేయడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని కోర్టు స్పష్టం చేసింది.
నిబంధనల అమలుకు స్పష్టమైన మార్గదర్శకాలు:
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది.
హెల్మెట్ ధరించడంలో ప్రజల అవగాహన పెంచడంతో పాటు, నిబంధనల అమలు పట్ల పోలీసులు మరింత కఠినంగా ఉండాలని సూచించింది.
సమాజంలో చైతన్యం తీసుకురావడానికి హైకోర్టు నిర్ణయం కీలకమవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
